తంజావూరులోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సరస్వతీ మహల్ లైబ్రరీ తెలుగు విభాగాన్ని పర్యవేక్షించే మిత్రుడు రవి రెండేళ్ల క్రితం ఒక వేసవి మధ్యాహ్నం ఫోన్ చేసి అక్కడ జరిగే, శాలియమంగళం భాగవతమేళాకు రమ్మని ఆహ్వానించాడు. దూరం వలన, మే నెల ఎండల వలన వెళ్ళడానికి మొదట కొంచెం సంకోచించాను. రవి మరీ పట్టుబట్టడంతో అతనిని సంతోషపెట్టడం కోసం అప్పటికి సరే అన్నానే కానీ నిజంగా వెళ్దామనుకోలేదు. ఆ తరువాత రోజున శ్రీ సి.ఎస్.ఎమ్. సుబ్రమణ్యం గారు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించి, భాగవతమేళా పుట్టుపూర్వోత్తరాలను చెప్పారు. ఆయన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదని, ఇండియన్ రైల్వేలో రిటైర్డ్ ఇంజనీర్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వీరు అమెరికాలోని ఫీనిక్స్ యూనివర్సిటీలో వారి అబ్బాయి అనిరుద్ చదువుకునేప్పుడు అక్కడి ఆర్ట్ విద్యార్థులతో కలిసి భాగవతమేళా డెమో లెక్చర్ ఇచ్చి మన ప్రాచీన కళారూపాలకు ఖండాతర ఖ్యాతి కల్పించారు. వారు చిన్నతనంలో భాగవతమేళాలో ప్రహ్లాదుని పాత్రను, పెద్దయ్యాక లీలావతి పాత్రను కూడా పోషించారట.
మేళాకు వెళ్లాలని నిర్ణయించుకుని చెన్నై వాసి మా బావమరిది పి.వి.రావుతో మాట్లాడాను. కళాప్రేమికుడైన ఆయన, ఎంతో ఉత్సాహంతో మా చెల్లెలు సంపూర్ణతో కలిసి వెళదామని భరోసా ఇచ్చారు. అలా మా భాగవతమేళాయాత్ర ఖరారయ్యింది.
మేము తంజావూరు బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు, తమిళనాడులోని తెలుగు సంస్కృతి మరియు కళలపై విస్తృత పరిశోధన చేస్తున్న డాక్టర్ సగిలి సుధారాణి గారు ‘ఈనాడు’ దినపత్రికలో ‘వన్నె తగ్గని యక్షగానం’ అనే వ్యాసం రాశారు. ఈ భాగవతమేళా మూలాలు కృష్ణా నది ఒడ్డున ఉన్న కూచిపూడిలో ఉన్నాయని, 16వ శతాబ్దంలో రఘునాథ నాయకుని పాలనలో గోదావరి ప్రాంతం నుండి నాలుగు వందల కుటుంబాలు తంజావూరుకు వలస వచ్చారని, నాయక రాజులు వీరికి కొన్ని అగ్రహారాలు దానమిచ్చారని రాశారు.
ప్రస్తుతం శాలియమంగళంలో ప్రదర్శించే యక్షగానాన్ని శ్రీభరతం పంచనద భాగవతార్ గారు రాశారట. పోతన గారి భాగవతం వీరి రచనకు ప్రేరణ. మేలటూర్లో ప్రదర్శించే యక్షగానాన్ని మేలటూర్ వెంకట్రామశాస్త్రిగారు రాశారట. ఈ యక్షగానాలన్నీ స్వచ్ఛమైన తెలుగులో రచించారు. అప్పట్లో నాలుగు ఊళ్ళల్లో మొదలై నేటికీ శాలియమంగళం, మెలటూరులో నిర్వహించబడుతోంది. శూలమంగళం, ఊత్తుకాడులో ఈ ప్రదర్శనలు కొన్నేళ్ళ తరువాత అంతరించాయి. కోవిడ్ కష్టకాలంలోనూ గత 370 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయ ప్రదర్శన నిర్వహించడం విశేషం.
నరసింహ జయంతి రోజు సాయంత్రానికి శాలియమంగళం చేరుకున్నాము. శ్రీ సి.ఎస్.ఎమ్. సుబ్రమణ్యం గారు మాకు సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడున్న నరసింహస్వామిని దర్శించి, మేళా ప్రారంభానికి ముందు కొందరు కళాకారులతో కాసేపు ముచ్చటించాము.

గణేశ ప్రార్థనతో ప్రహ్లాద విజయం ప్రారంభమైంది. ఎనిమిదేళ్ళు కూడా నిండని చిన్న చిన్న పిల్లలు బాల గణేశుడు మరియు మురుగన్ పాత్రలను ఎంతో మనోహరంగా పోషించారు. వారి కుటుంబాల్లో బాలారిష్టాలు తొలగిపోవాలని స్వామికి మ్రొక్కుకుని తమ పిల్లలతో మేళాలో బాల వినాయకుడి వేషం వేయించడం వారి నమ్మకం. గణేసునికిì పోటీ ఎక్కువైతే లాటరీ వేసి వొక్కరికే అవకాశం కల్పిస్తారట.

ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగే నరసింహ జయంతికి కూడా మమ్మల్ని రమ్మని శ్రీ సి.ఎస్.ఎమ్. సుబ్రమణ్యం గారు ఆహ్వానించారు. యక్షగానంలో చివరి అంకం అద్భుతమని, అది మీరు తప్పక చూడాలని మళ్ళీ రండి అని ఒత్తిడి చేశారు. ఇంకోసారి వెళ్దామా అని ఆప్తమిత్రుడు వాసుని అడగడమేమిటి తను టిక్కెట్స్ కొనేసి వాట్సాప్ కు పంపడం క్షణంలో జరిగిపోయాయి. కృష్ణరాయబారంలో తప్పదు యుద్ధము బంధునాశము, అయినను పోయిరావలె హస్తినకు అన్నట్లు అయినను పోయిరావలె శాలియమంగళమునకు అని ఇద్దరం ముందురోజే తంజావూరు చేరుకున్నాం. ఈసారి భాగవత మేళా ఆసాంతం చూడటానికి కమిటై ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోయి మరీ గేరప్ అయ్యాము.
సాయంత్రం ఆరు గంటలకు శాలియ మంగళం చేరుకుని పూజలో పాల్గొన్నాం. మేళా నిర్వాహకులు మమ్ము సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసారు. సావనీర్ విడుదలానంతరం మేలటూరు వెళ్ళి అక్కడి నిర్వాహకులను కలిసాము. మేలటూరు మహాలింగం గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉగాది ఉత్సవాల్లో కళారత్నపురస్కారంతో సత్కరించినందుకు అభినందనలు తెలిపి, వారితో ముచ్చటించి తిరిగి రాత్రి 10 గంటలకు శాలియ మంగళం చేరాము.
ఆ రోజు రాత్రి ప్రహ్లాద విజయం ఆద్యంతం అత్యంత శోభాయామానంగా కొనసాగింది. హిరణ్యకశ్యప పాత్రధారి చి.అనిరుద్ జర్మనీలో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తూ, గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్లో శిక్షణ పొంది ఈ పాత్రను పోషించాడు. ఈ పాత్ర పోషించడం తన జీవిత లక్ష్యమని చెప్పాడు. తన హావభావాలతో, అభినయంతో ఆ పాత్రను ఎంతో హృద్యంగా ప్రదర్శించాడు. బాలప్రహ్లాదుడు UKG విద్యార్థట. నరసింహస్వామి మళ్ళీ మా సుబ్రహ్మణ్యంగారే. లీలావతి పాత్రధారి TCS ఉద్యోగి, సూత్రధారి వేషధారి తొమ్మిదో తరగతి చదువుతూ వేదాధ్యయనం చేస్తున్న మరో బాలుడు. గాత్రబృందంలో ఒకరు సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగి, ఇంకొకరు TVS గ్రూపు ఉద్యోగి. మరొకరు ఏవియేషన్ ఇంజనీరు. వీరిలో ఏ ఒక్కరూ కళాకారులు కారు.
తెల్లవారు జామున మూడున్నర గంటలకు నరసింహ ఉద్భవం. ఉ్రగ నరసింహుని ఆహార్యం మరాఠీ ప్రభువుల ఆహార్యాన్ని పోలి ఉంది. స్వామి ధరించిన మాస్క్ మూడు వందల ఏళ్ళ క్రితం అత్తమరం (పైడి) చెట్టు నుండి తయారు చేసారట. నేటికీ అదే మాస్క్ను పవిత్రంగా పరిరక్షిస్తూ, ప్రతీ ఏడూ దానినే ధరించడం విశేషం. హిరణ్యకశ్యప, నరసింహ సంవాదానికి అక్కడి అగ్రహారం వీధే రంగస్థలం. వీధికి ఇరువైపులా ప్రేక్షకులు గంటల తరబడి కదలకుండా కూర్చొని మేళాను తిలకించడం అద్వితీయం. నేలపై కూర్చొని పదినెలలు నిండని పసిపిల్లలను ఒడిలో పెట్టుకుని నటులతోపాటు వంతపాడే వాళ్ళను, ఐదారు సంవత్సరాల పిల్లల్ని కూర్చొబెట్టుకుని తాళమేసే బామ్మలను, డెబ్భైదాటిన వృద్ధదంపతులను రంజకులైన ప్రేక్షకులుగా చూడటం ఇంకెక్కడా ఉండదేమో.

ప్రేక్షక తన్మయత్వం
సంవాదానంతరం హిరణ్యకశ్యప సంహారం, ప్రహ్లాద పట్టాభిషేకం జరిగింది. స్వామి ప్రహ్లాదుని ఒక అంకం మీద, లక్ష్మీదేవిని వామాంకం మీద కూర్చొబెట్టుకుని గ్రూప్ ఫొటో దిగడంతో నాటకం ముగిసింది. ప్రహ్లాదుడు స్వామిని శాంతింపజేసిన తరువాత స్వామిని వీధి చివరనున్న గుడికి ఊరేగించారు. ఊరేగింపు వెనుక ప్రేక్షకులందరూ పొర్లుదండాలు చేసుకుంటూ గుడికి చేరుకున్నారు. స్వామినడిచిన పాదధూళి సోకితే పావనమవుతామన్న విశ్వాసంతో భక్తులు పొర్లుదండాలు చేస్తారని సుబ్రహ్మణ్యంగారు చెప్పారు.

ఆ నరసింహ జయంతి రాత్రి శాలియమంగళం ప్రహ్లాద చరిత్ర భాగవతమేళా గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఎవరి ఆదరణ లేకపోయినా, ఏ ప్రభుత్వ సహకారం లేకున్నా, కొన్ని వందల సంవత్సరాలుగా భాగవతమేళాను కొనసాగించడం వెనుక, తమ వారసత్వాన్ని, తమ సంస్కృతిని కాపాడుకోవాలనే వారి తపన, దృఢసంకల్పం అబ్బురం. వీరి తపన చూస్తే forests are surviving despite forest Dept, అన్నట్లు, Culture will Survive despite Culture Dept అన్న నమ్మకం బలపడింది.
శాలియమంగళం మరియు మేలటూరు అగ్రహారికులు ప్రతి ఏటా జరిగే నరసింహ జయంతి భాగవతమేళాలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆ రోజున గ్రామమంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. అంతరించిపోతున్న యక్షగాన కళారూపాల్ని కాపాడటంలో వారి చిత్తశుద్ధి, అంకితభావం, పట్టుదల అత్యంత అభినందనీయం.

ఇటువంటి ప్రతిఫలాపేక్షలేని కళాభిమానుల్ని చూసినప్పుడల్లా, “ఒక దేశం యొక్క సంస్కృతి ఆ దేశ ప్రజల హృదయాలలో, ఆత్మలలో నిలిచి ఉంటుంది” అన్న మహాత్మా గాంధీ మాటలు ఎంతో వాస్తవం కదా అనిపించక మానదు.
ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో హైదరాబాద్లో భాగవతమేళా డెమో లెక్చర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మాన్యులు శ్రీ కె.వి.రామణాచారి, ఐ.ఎ.ఎస్ గారితో పంచుకున్నప్పుడు వారు తప్పక ఏర్పాటు చేద్దామని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరం.
(మరోమారు మేలటూర్ యాత్రను దిగ్విజయంగా జరిపించడంతోపాటు శ్రీరంగనాథుని సన్నిధిని, తిరువాయూర్ త్యాగరాజ సన్నిధిని ప్రాప్తింపజేసిన ఆప్తబంధు వాసుకు నమస్సులతో…)

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో తంజావూరు పెయింటింగ్స్ చూశాను. చాలా కలర్ ఫుల్ గా కళాత్మకంగా ఉన్నాయి. తంజావూరు అంటేనే అలా ఉంటుందేమో. అక్కడ మనుషులు కూడా అలానే కళాత్మకంగా ఉంటారేమో అనిపించింది ఈ కథనం చదివాక.
హర్ష వనంలో మరో పంట పండించినందుకు ధన్యవాదములు. చాలా బాగుంది మీ ప్రెసెంటేషన్.
హర్షవర్ధన్ గారు ఏ విషయం మీద వ్రాసినా చాలా నిశితంగా పరిశీలించి కళ్ళకు కట్టినట్లు వ్రాస్తారు. వారికి హార్ధికాభివందనములు.
హర్ష వనంలో మరో అద్భుతమైన పంట పండించారు. చాలా బాగుంది.
హర్ష గారు,
ఇలాంటి ఒక భాగవత మేళా జరుగుతుందనే తెలియదు, పైగా కళ్ళకు కట్టినట్లు వివరించారు.
ధన్యవాదములు 🙏
మీరు వివరించిన భాగవతమేళ నిజముగా ఆనంద హేళ! మీరు పంచుకున్న అనుభవాన్ని మేము కూడా హృదయపూర్వకంగా అనుభూతి చెందాము సర్.
భాగవత మేళా ను కళ్ళ కద్దినట్టు మీరు వివరించిన విధానం చాలా బాగుంది. మేమూ మీతో బాటే వచ్చి తిలకించినట్టే ఉంది సుమండి!
చాలా కొత్త విషయాలు తెలిసాయి.
ధన్యవాదాలు———చలం
ఈ భాగవతమేళా తప్పకుండా ఖచ్చితంగా చూడాలి అని అనిపించేలా ఉందండి. కళ్లకు కట్టినట్లు చూపించారు. అద్భుతం.
మేళా ను హృదయం కి హత్తుకునేలా అభివర్ణించారు హర్షా గారు…అందునా మీరు పదిల పరచిన చిత్రములు చూపరులకు ఆనందం కలిగిస్తున్నవి